కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

  • ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ఎమ్మెల్యే రవి కారు
  • ఇద్దరు దుర్మరణం, ఎమ్మెల్యేకు స్వల్పగాయం
  • వివరణ ఇచ్చిన కర్ణాటక బీజేపీ విభాగం
కర్ణాటకలోని తుముకూరు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎమ్మెల్యే రవికి స్వల్ప గాయమైంది. కొందరు వ్యక్తులు ఓ కారులో కొల్లూరు ఆలయాన్ని దర్శించుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు చెందిన కారును ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కునిగల్ వద్ద సదరు వాహనం ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న కారులోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయమై కర్ణాటక బీజేపీ విభాగం స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో రవి కారును నడపలేదనీ, ఆయనకు మద్యం అలవాటు కూడా లేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకూ ఎమ్మెల్యే రవి అక్కడే ఉన్నారని తెలిపింది. రవికి ఈ ప్రమాదంలో ఛాతీ భాగంలో గాయమయిందనీ, ఆయన సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్లిపోయారని పేర్కొంది. మరోవైపు రవి కారును విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
Karnataka
BJP
Road Accident
two dead
Police
Twitter

More Telugu News